Thursday 30 May 2013

SUCCESS UNLIMITED Class by CHIRANJEEVI "MEDHA" in

                                                                                                MANTHRI NAGENDRA
Our happiness is depending how we think ,If u think positive all is positive if u think negitive all is negitive.
HOW U THINK IS U R CHOICE.




MANTHRI NAGENDRA
                                              YOU CAN DO IT BELIVE YOURSELF
"In youth we squander our health for wealth. In old age we squander our wealth for health ' 

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాంగికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలా కాన్త త్రై లోక్యం మంగళం కురు

ఈ సంస్కృత వాక్యాలు వినని వారు మనలో చాలా అరుదు. ప్రతి ఇంటా, ప్రతి ఆలయంలో వినిపించే ఈ మంగళ వాక్యాలు విద్యాభ్యాసం చేస్తున్న రాముడిని తెల్లవారు జామున మేల్కొలుపుతూ గురువు విశ్వామిత్రుడు పలికిన మాటలు. ‘‘కౌసల్య సుపుత్రుడవైన ఓ శ్రీరామా! సూర్య భగవానుడు రాబోయే వేళవుతోంది. ఓ నర శ్రేష్ఠుడా మేలుకొనుము. నీకు దైవం నిర్దేశించిన కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంది. ఓ గరుడధ్వజా! నీవు నిదుర లేచి నీ కర్తవ్య నిర్వహణతో ముల్లోకాలకు మంగళం చేకూర్చు’’.

ఈ మాటలు వింటుంటేనే ఏదో అవ్యక్తానుభూతి కలుగుతుంది. మరి ఆ సమయంలో నిద్ర లేచి ప్రకృతి ఒడిలో పులకరిస్తూ కర్తవ్యోన్ముఖులమైతే ఎలాంటి అనిర్వచనీయ ఆనందం కలుగుతుందో చెప్పనవసరం లేదు. సంబోధనలోనే గుణ, కర్మ, కర్తవ్యాలను గుర్తు చేస్తూ పలికిన ఆ విశ్వామిత్రుని మధురమైన మేల్కొలుపునకీ.. కుంభకర్ణుడి అన్నలా నిద్ర పోతున్నావు.. నిద్రపోయింది చాలు గానీ లేచి అఘోరించు. ఇలాగైతే పశువుల కాపరిగా కూడా పనికి రావు.. అంటూ నిష్ఠుర భాషణంలో నిద్ర లేపడానికి ఎంత తేడా? వినడానికే ఇంత వ్యత్యాసం ఉంటే ఆ మాటల ప్రభావంలో ఎంతటి వ్యత్యాసం ఉంటుందో? ఆధునిక సమాజంలో కూడా గురువులు, తల్లిదండ్రులు తెల్లవారుజామున తాము లేచి పిల్లల్ని లేపడానికి విశ్వామిత్రుడు మార్గదర్శిగా ఎంత చక్కని మార్గం చూపాడు!

అసలు తెల్లవారు జామున ఎందుకు లేవాలి?

'Early to bed and early to rise makes a man healthy, wealthy and wise' అన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలు ఎన్నోసార్లు మనందరం వినుంటాం. వేకువ జామునే నిద్రలేచి, రాత్రి పూట మరీ ఆలస్యం కాకుండా నిద్రించే వారు ఆరోగ్యవంతులు, సంపన్నవంతులు, వివేకవంతులు అవుతారని దీనర్థం. ఎన్నిసార్లు విన్నా పాటించాల్సి వచ్చేసరికి బద్ధకం ఆవరించేస్తుంది. ఇంకాసేపు పడుకుందాంలే అనే భావన మనసంతా ఆక్రమించి శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. రేపటి నుంచి తెల్లవారు జామున లేద్దాంలే అనుకుంటూ.. ఆ ఎప్పుడూ రాని రేపటి కోసం మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ మస్తిష్క దాసులమై రోజులు గడిపేస్తుంటాం. ఎవరి అలవాటు వారిది. కొందరు అర్థరాత్రి అయ్యే వరకూ కష్టపడి బారెడు పొద్దెక్కిన తర్వాత లేస్తారు. మరి కొందరు తనికెళ్ల భరణి గారన్నట్లు తామే ముందు లేచి భాస్కరుణ్ని (సూర్యుడిని) లేపుతారు.

శశిని (చంద్రుడిని) చూడకనే పడుకునే పసి మనస్సువారు.
ఆహారం గానీ, అలవాట్లు గానీ, ఆహార్యం గానీ.. వీటన్నింటికీ సంబంధించిన విషయాల ప్రస్తావన కుటుంబ పరిధిలోనే బాల్యం నుంచీ నాటుకుని ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం పురోగతి సాధించిన తర్వాత మనకిష్టమైన వాటిలో రుజువులు, పరిశోధనల ఫలితాలు అడగకపోయినా కష్టమైన వాటిలో తప్పకుండా అడుగుతాం. అయితే అన్ని విషయాలూ పరిశోధించనలవి కాకపోవచ్చు. అలాగే కొన్ని అనుభవైక వేద్యాలూ కావచ్చు.

ఎప్పుడు లేవాలి?మన సంప్రదాయంలో బ్రహ్మ ముహూర్తంలో లేవమని చెబుతారు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయ సమయానికి నాలుగు ఘడియల ముందు ప్రారంభమై రెండు ఘడియల ముందు ముగుస్తుంది. ఘడియ అంటే 24 నిమిషాలు. అంటే బ్రహ్మ ముహూర్తం సూర్యోదయ సమయానికి 96 నిమిషాల ముందు ప్రారంభమై 48 నిమిషాల ముందు ముగుస్తుంది. ఈ సమయంలో నిద్ర లేచి కార్యోన్ముఖులైతే మనిషిలో నిద్రాణంగా ఉన్న కొన్ని సాత్విక శక్తులు వృద్ధి చెందుతాయి. స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద, కాలుష్య రహిత వాతావరణం, పక్షుల కిలకిల రావాలు మనసుకు ఉల్లాసాన్ని కలుగ జేస్తాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారనీ, కార్యసాధకులు ఈ సమయంలో చేసే సాధనకు తమ వంతు ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందిస్తారనీ విజ్ఞులు అంటారు. బ్రహ్మీ అంటే చదువుల తల్లి సరస్వతీ దేవికి మరో పేరు. బ్రహ్మ బుద్ధినీ, జ్ఞానాన్ని కలుగజేసే దేవత. ఇలా బుద్ధి వికాసానికి, జ్ఞాన ప్రకాశానికి అనువైన సమయం కనుక బ్రహ్మ ముహూర్తం అంటారు.

ఎందుకు లేవాలి?
తెల్లవారు జామున తొందరగా నిద్రలేస్తే మన పనులను తొందరగా ఆరంభించ గలుగుతాం. రోజులో ఎక్కువ సమయం మన ఆధీనంలో ఉంటుంది. వైజ్ఞానిక పరంగా ఆ సమయంలో వీచే చల్లని ఆహ్లాదకరమైన గాలి రక్త ప్రసరణని క్రమబద్ధం చేసి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆ సమయంలో ఫోన్లు మోగవు. రణగొణ ధ్వనులుండవు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాయామం, దైనిక, దైవిక కార్యకలాపాలు నిర్వఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగుతాయి. జీవన గమనంలో అతి వేగం, అజాగ్రత్త్ర, అలసట, అనిద్ర, ఆలస్యం, ఆందోళన తగ్గి ప్రకృతితో సామరస్య సహ జీవనానికి అలవాటు పడతాం. సరైన సమయంలో నిద్రలేస్తే వేళకు ఆకలి వేయడం, ఆహారం తీసుకోవడం, పరిశ్రమ చేయడం, మళ్లీ వేళకు (పెందలాడే) విశ్రమించడం.. ఇలా శరీరం తన సహజమైన లయను పొందుతుంది. మనం బయట వెతకడానికి ప్రయత్నించే ప్రశాంతతను మనలోనే ఉందని గ్రహించ గలుగుతాం. ‘శరీర మాద్యం ఖలు ధర్మ సాధనమ్’- (మనం చేసే ధర్మ సాధన అంతా, కర్మ సాధన అంతా ఈ శరీరమనే ఉపకరణం ద్వారానే జరగాలి.) శరీరం తన సహజ లయను తిరిగి పొందినప్పుడు మన శరీరం, మనస్సు, బుద్ధి వికసించి మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడి వాటి ఫలాలు బోనస్‌తో సహా మనకు సకాలంలో అందుతాయి. అందుకే ఆయుర్వేదంలో ఇలా చెప్పడం జరిగింది...


బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ఠే స్వాస్థ్య రక్షార్ధ మాయుషః
తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనమ్

‘బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుని స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్షు, సర్వ సంపదలు, సుఖ శాంతులు లభిస్తాయి.’

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి. More Oxygen-Better Health. తెల్లవారు జామున 41/2 నుంచి 6 గంటల వరకు కాలకృత్యాలకు ప్రకృతి సహజ సిద్ధంగా సహకరిస్తుంది. ఉదయం 7 నుంచి 9 వరకు చిన్న పేగుల్లో పోషకాలను పీల్చుకునే సామర్థ్యం పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట అల్పాహారానికి ఇది అత్యంత అనువైన సమయం. అలాగే పగలంతా పరిశ్రమ చేసి రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ నిద్రలోకి ఉపక్రమిస్తే (కళ్ల నిండా నిద్ర ఎప్పుడొస్తే అప్పుడు) ఆ సమయంలో శరీరంలోని anti body system శరీరపు Detoxification (శుద్ధీకరణ) ప్రక్రియను ప్రారంభిస్తుంది.

రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు గాఢ నిద్రలో ఉండే వారికి కాలేయంలో ఈ శుద్ధీకరణ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు గాల్ బ్లాడర్ శుద్ధీకరణ (గాఢ నిద్రలో ఉంటే) జరుగుతుంది. తెల్లవారు జామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఊపిరితిత్తుల నిండా ప్రశాంతంగా శ్వాస తీసుకునే వారికి ఆ ఊపరితిత్తుల శుద్ధీకరణ సాఫీగా జరుగుతుంది. ఇలా రాత్రి పెందలాడే నిద్రించి, తెల్లవారు జామున పెందలాడే నిద్ర లేస్తే శరీరం తన బాగోగులు సమర్థవంతంగా చూసుకోవడంలో సఫలం అవుతుంది. సాయం సంధ్య తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి శరీరాన్ని నిద్రకు ఉపక్రమింపజేస్తే ఉదయం సంధ్య ముందు మళ్లీ వాతావరణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ శరీరాన్ని నిద్ర లేపడానికి సహజంగా తోడ్పడతాయి. (శరీరాన్ని ACలో శీతలీకరణం చేస్తే తప్ప).

'The early morning has gold in its Mouth' అంటారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ‘గత 50 సంవత్సరాల్లో నేను నిద్రపోతూ ఎప్పుడూ సూర్యుడికి పట్టుబడలేదు.’ అంటారు.. అమెరికా రాజ్యాంగ పితామహుడు థామస్ జెఫర్‌సన్! జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారు జామున ఒక గంటలో చేయగలిగిన పని మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు, మూడు గంటలు పడుతుందని, ఆలోచనా స్పష్టత, అమలు చేసే పటిమ ఆ సమయంలో మెండుగా ఉంటాయని, తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారు జామున తీసుకున్నవేననీ చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.

మన పూర్వీకుల మాటల్లో చెప్పాలంటే..
షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతి మిఛ్ఛతా నిద్రా తంద్రా భయం శోకమాలస్యం దీర్ఘ సూత్రతా
ఐశ్వర్యం (భౌతిక, మానసిక, జ్ఞాన, ఆధ్యాత్మిక) కావాలంటే నిద్ర, సోమరితనం, భయం, దుఃఖం, ఆలస్యం, వాయిదా వేయడం.. ఈ ఆరింటినీ విడిచి పెట్టాలి.

సూర్యోదయం పూర్వమే నిద్రలేచి నియమబద్ధంగా జీవిస్తూ కర్తవ్య నిర్వహణ చేస్తే శరీరం అలసి తొందరగా నిద్రొస్తుందే కానీ అనవసర ఒత్తిడి (Stress) పెరగదు. చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయదగిన విధంగా చేయకపోతే శరీరమనే ఉపకరణాన్ని ఉపయోగించి చేసే జీవితమనే సంగీత సాధనలో శరీరం నుంచి, మనసు నుంచి, బుద్ధి నుంచి కూడా అపస్వరాలే వచ్చి అపహాస్యం పాలవడమే జరుగుతుంది. వెచ్చని పక్క మీద హాయిగా తెల్లవారే వరకు పడుకోవడం అలవాటైన శరీరానికి, తెల్లవారు జామున నిద్రలేవటం ఆరంభంలో దుర్భరమే. అయినా ధైర్యం చేసి నిద్రలేచి దైనందిన కార్యాలపై మసను మళ్లించి స్నానం చేసి కార్య సాధన ఆరంభిస్తే నెమ్మదిగా దాని వల్ల కలిగే ప్రశాంతత, ఆనందం, ఏకాగ్రత, నిర్మాణాత్మక ధోరణి, ఆత్మ సంతృప్తి, అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంటుంది. నిద్రను మన ఆధీనంలో ఉంచుకుని శరీరం మీద పట్టు సాధిస్తే నైతికంగా కూడా ఎంతో స్థైర్యం చేకూరుతుంది. ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం కూడా ఏర్పడుతుంది.

ఆలస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్ అథనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం 
ఆలస్యంగా లేచే వానికి విద్య ఎలా వస్తుంది? విద్య లేకుండా ధనం ఎలా? ధనం లేకుంటే మిత్రులుండరు. ఇవి లేకుంటే సుఖముండదు.

లేవడం ఎలా?
మానవ శరీరం కూడా ఈ అనంత ప్రకృతిలో భాగమే. అందుకే ప్రకృతి అంతా మేల్కొనేటప్పుడు మనం కూడా మేల్కొనే విధంగానే ఈ శరీరం రూపొందింది. నెమ్మదిగా మనకి మనం మేల్కొనటం ఆరంభిస్తే కొద్ది రోజులకు స్వప్రేరణ ప్రారంభమవుతుంది. శరీరం తనంతట తానే మేల్కొంటుంది. అదీ ఆనందంగా. మనం చేయావలసిందల్లా ప్రకతితో మమేకం కావటానికి ప్రయత్నించడమే. ఆరంభంలో లేవడం అలవాటయ్యే వరకూ అలారాన్ని మంచం దగ్గర కాక దూరంగా ఉంచితే మంచిది. రాజీ పడిపోయి బద్ధకాన్ని వదలకుండా వెంటనే నిద్రకు ఉపక్రమించే తత్వాన్ని ఇది కొంత వరకూ ఆపుతుంది. దీంతోపాటు కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ వహిస్తే ఫలితం బాగుంటుంది.

పగటి నిద్రను వీలైనంత వరకూ వదిలి వేయటం మంచిది. మరీ అలసటగా ఉంటే 10 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. పగటి నిద్ర, రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. పడుకునే ముందు చిన్నపాటి నడక మంచిదే కానీ తీవ్ర వ్యాయామం గాఢ నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. వీలైనంత వరకూ ఒకే సమయానికి నిద్ర పోయే అలవాటు చేసుకుంటే మంచిది. నిద్రించే ప్రదేశాన్ని వీలైనంత కాంతి రహితంగా ప్రశాంతంగా ఉంచటం మంచిది. పూర్తిగా నిద్ర వస్తే తప్ప పక్క మీదకు వెళ్లకూడదు. రాత్రి పూట తేలికైన ఆహారం అదీ నిద్రపోయే రెండు గంటల ముందుగా తీసుకోవడం మంచిది. నోటితో తీసుకునే ఆహారమే కాకుండా మిగిలిన అన్ని ఇంద్రియాలతోనూ తీసుకునే ఆహారం నిద్ర పోయే రెండు గంటల ముందే తీసుకోవటం మంచిది. స్వచ్ఛమైన గాలి ప్రసరించే విధంగా మనకున్న ఆవరణలోనే ప్రయత్నించాలి. స్వచ్ఛమైన గాలి అన్ని అవయవాలను శాంత పరుస్తుంది. కృత్రిమ ఉత్ప్రేరకాలను (కాఫీ, టీ..) దూరంగా ఉంచితే శరీర కణాలు ఉద్రేక పడకుండా ప్రశాంతంగా ఉంటాయి. ఆలస్యంగా నిద్రలేచి అసహజ పదార్థాలను ఆస్వాదిస్తూ.. అందరినీ అనవసరంగా ఇబ్బంది పెడుతూ.. ఆందోళన పెంచుకుని, అనవసర ఒత్తిడికి లోనవుతూ.. తొందర తొందరగా పనులు ముగించడానికి పరుగులు తీస్తూ.. అందరూ మనల్ని అలరించటానికి, ఆదరించటానికే ఉన్నారని భావిస్తూ, అది మన సామర్థ్య నైపుణ్యాలకు చిహ్నంగా భావించుకుని మనం లేకపోతే ప్రపంచం ఆగిపోతుందేమోనన్న భ్రమను సృష్టించుకుని.. ఆ అజ్ఞానంతో శరీరాన్ని, దాని సృష్టి, స్థితి, లయలను మరిచి పోయి అంతర్ముఖులమై, ఆత్మ పరీక్షలో ఆనందంగా ఉండలేక చింతోన్ముఖలమై.. శరీరాన్ని, మనసును శిథిలం చేసుకుంటున్నామేమో.. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.

తెల్లవారుజామున లేచి ఆరోజు ఆరోగ్యంతో నిద్రలేచి నందుకు సృష్టి-స్థితి-లయ కర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకుని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నేరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి. నిద్రావస్థలో ఉన్న శరీరాన్ని స్నానాదులతో శుభ్రం చేసి, కర్తవ్య నిర్వహణ కోసం జాగ్రదావస్థలోకి తీసుకురావడానికి శరీరానికి అనువైన/అనుకూలమైన నియమిత వ్యాయామం అవసరం.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయిష్యం బలం సుఖం ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్ధ సాధనమ్
(వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్షు, సుఖం కలుగుతాయి. ఆరోగ్యమే శ్రేష్ట సంపద. ఆరోగ్యముంటే సర్వ సంపదలూ ఉన్నట్లే.)

ఈ వ్యాయామం ఎవరికి వారు తమ సాధ్యసాధ్యాలను, ఇష్టాఇష్టాలను బట్టి నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా యోగ లాంటి ప్రాచీన సంపూర్ణ వ్యాయామ విధానాలు ఎక్కువ సమయం, ధనం, బలం, స్థల వైశాల్యం, అవసరం లేకుండా శరీరంలో ఉన్న భౌతిక బల నిల్వల్ని రూపాంతరం చెందిస్తూ జ్ఞాన, ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడతాయి. ఎవరో ఏదో చేస్తున్నారని మనం గుడ్డిగా అనుకరించాల్సిన అవసరం లేదు. మన శరీరం, మన అవసరాలు, మన సదుపాయాలు, మన ప్రకృతి, మన బాధ్యతలు.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి. లేకపోతే ఆరోగ్యం కోసం చేసే కృత్రిమ అనుకరణ వ్యాయామం అనారోగ్యం పాలు చేయవచ్చు. ప్రకృతికి ఎంత దూరంగా జరిగితే అంత అనారోగ్యం పెరుగుతుందంటారు జాన్ రస్కిన్ తన "Unto This Last' గ్రంథంలో! కొందరు తమ దైనందిన కార్యకలాపాల్లోను, నిర్వహణలోను తమ వ్యాయామాన్ని అంతర్మిళితం చేస్తారు. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవటం.. మన పాత్రలు, మన బట్టలు, మనం శుభ్రపరుచుకోవటం లాంటివి ఆత్మానందాన్ని కలిగిస్తాయి. జీవితంలో ధనం కోసం, వృత్తి కోసం చేసే పనే ఉత్తమమైనది అనుకోవటం 21వ శతాబ్దాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సూర్యోదయం సమయంలో ఉండే ప్రకృతి పులకరింతలో స్వకార్యాలకు స్వావలంబనలో ఉండే సుఖం, మన శ్రమ వల్ల ఇతరులకు కలిగే ఆనందం, సహజ సౌందర్యోపాసన లాంటి సహజ విషయాలను అనుభవించలేరు, ఆస్వాదించలేరు, ఆనందించలేరు. అదే వారిలో అనవసర ఒత్తిడి పెంచి వ్యాధిగ్రస్తుల్ని చేస్తుందేమో అంటారు ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్. ఈనాటికీ తన చిన్న ఇంట్లోనే ఉంటూ (సౌధాలు కట్ట కలిగి/ వాటిలో ఉండగలిగి కూడా) తనకూ, తన జీవిత భాగస్వామికీ పానీయాలు, ఫలహారాలు తయారు చేయడం తనకు అత్యంత ఇష్టమైన పని అని ఆనందంతో చెబుతారు ఆయన. మనం ఎంత ఎత్తు ఎదిగినా మన ఎదుగుదలకు తోడ్పడిన అలవాట్లను వదలవల్సిన అవసరం లేదని అదే ఆరోగ్యానికి మూల సూత్రమని ఆయన భావం.

అబ్రహం లింకన్ మాటల్లో ""In youth we squander our health for wealth. In old age we squander our wealth for health ' యవ్వనంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపదనీ, వృద్ధాప్యంలో సంపదని పణంగా పెట్టి ఆరోగ్యాన్ని సంపాదించటానికి/కొనుక్కోవటానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో సహజంగా జీవించడం మర్చిపోయి జీవితాన్ని కూడా ఒక Transaction లాగా మార్చేసుకున్నామా అనిపిస్తుంది. అదే ప్రకృతి లయలో మనం భాగస్వాములైనప్పుడు ఒక సహజమైన ప్రశాంతత ఆనందం చోటు చేసుకుని అది వివేకానికీ, ఆత్మానందానికీ తోడ్పడతాయి. మరి భాగస్వాములం కావడం ఎలా? భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఆహార, విహార, నిద్ర, స్వప్నాలలో యుక్తంగా ఉండటమే యోగం అని. (యోగం అంటే జోడించడం). ప్రకృతి లయకి తనను జోడించుకుని లయాత్మకంగా జీవించడమే కదా యోగం.

కశ్యప ప్రజాపతికి వినీతకి పుట్టిన అనూరుడు వినీత తొందరపాటు వల్ల జన్మతోనే కాళ్లు లేకుండా జన్మించాడు. బ్రహ్మదేవుడు అతణ్ణి సూర్యరథానికి సారధిగా నియమించి అతను (అనూరుడు) సూర్య రథాన్ని తీసుకువచ్చే సమయానికి ఎవరు నిద్ర లేచి కార్యసాధనలో నిమగ్నలవుతారో వారిపై ఏ గ్రహం, నక్షత్రం చెడు ప్రభావం చూపలేదని వరమిచ్చాడని ఒక కథ. మహర్షి శుశ్రుతుని ప్రకారం తెల్లవారు జాము సమయం ( బ్రహ్మ ముహూర్తం) అమృతం వంటిది. అధర్వణ వేదం ప్రకారం ఈ సమయంలో చేసే సాధన వల్ల సత్వగుణ సంపద పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త...) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన...) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివికా! రాత్రి నిద్రోన్ముఖుడివికా! అంటారు మన మహర్షులు. తెల్లవారు జామున ఆలోచించి ప్రణాళికలు వేసుకోవటం వల్ల వ్యూహాత్మకంగానూ, ముందు చూపుతోనూ ఆలోచించి ప్రతి స్పందించగల్గుతాం అంటారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.

ఈ సమయంలో శరీరాన్ని, మనసును స్వాధీనంలో ఉంచుకొని చేసే ప్రయాసల వల్ల వచ్చే Clarity of thought (ఆలోచనా స్పష్టత), Clarity of expression (భావ వ్యక్తీకరణలో స్పష్టత), Clarity of goal and role (బాధ్యత, లక్ష్యాలలో స్పష్టత) స్వానుభవంతోనే తెలుస్తాయంటారామె.

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్
ఆత్మైవః ఆత్మనోబంధుః ఆత్మైవ రిపురాత్మనః

నీ పురోగతికి నీవే కారణం కావాలి. అధోగతికి కాదు. నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. నీవు అభివృద్ధి చెందినా అధోగతి చెందినా అది నీ కర్మల వల్లనే... అనేది గుర్తుంచుకో అన్న యోగ వాశిష్ఠంలోని వాక్కులు రైస్ మాటల్లో ధ్వనిస్తాయి.

శరీరానికి, మనసుకు, బుద్ధి వికాసానికి తగినంత నిద్ర అవసరం. అయితే ఆ నిద్ర యుక్తమైన సమయంలో పోవాలి. ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ జంతు జన్మలన్నింటిలోనూ మానవ జన్మ లభించటం దుర్లభం. మరి అలాంటి నర జన్మ లభించినపుడు జంతు ప్రవృత్తి నుంచి దైవిక ప్రవృత్తి వైపు అడుగులు వేయించేదే మానవ జన్మ. మన కర్తవ్య నిర్వహణకు శరీరమే సాధనమైనపుడు, ఆ శరీరాన్ని దైవత్వం వైపు మళ్లించాలంటే సత్వగుణ సంపన్నంగా చేయాలి. శరీరాన్ని సత్వగుణ సంపన్నంగా తీర్చిదిద్దే సమయం బ్రహ్మ ముహూర్త కాలం. అందుకే దేవాలయాలలో, చర్చిలలో మసీదుల్లో కూడా తెల్లవారు జామునే ప్రార్థనలు ప్రారంభమవుతాయి. తెల్లవారు జామున లేచే వారికి సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి కాంతి లభించటం వల్ల అది అత్యంత శక్తివంతమైన సమయమనీ, ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి.

కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్
తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః
చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు.

సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు. ఉదయించమని ఆయనకు ఎవరు చెబుతున్నారు? ప్రకృతిలో అంతర్భాగంగా సహజ క్రమశిక్షణ, సమయపాలనతో ఆయన ఉదయిస్తున్నాడు. మనమూ అంతే. ఒక నిర్దిష్ట జీవన విధానాన్ని సాగించాలంటే వ్యక్తిగత క్రమశిక్షణ అవసరం. అదే శీల నిర్మాణంలో తర్వాత జీవన గమ్యాన్ని చేర్చటానికి చుక్కానిలా పనిచేస్తుంది. ‘తెల్లవారు జాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్! తెల్లవారు జామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి. అప్పుడే దాన్ని ఆనందించగల్గుతాం. దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం, ఆనందం రెండూ తక్కువైపోతాయి. మార థాన్ పరుగు పందెంలో పాల్గొనే వారిలో 90 శాతం పైగా తెల్లవారు జామున లేచి, సాధన చేసి పతకాలు సాధించిన వారే. స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేథావులు, రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, అధికశాతం తెల్లవారు జామున లేచి సాధన చేసిన వారే. తెల్లవారు జామున లేవడం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలచుకున్నవారే. ఇదే విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించారు.

అమృత ఘడియలు
క్రిస్టఫర్ రాండ్లర్ అనే జర్మన్ జీవ శాస్త్ర ప్రాచార్యులు "Harvard Business Review’లో ప్రచురితమైన తన పరిశోధన ఫలితాల విశ్లేషణలో "To really surpass mediocrity and to attain excellence, you will have to wake up early in the morning. Morning people anticipate problems and try to minimise them. They are proactive' అంటారు. అలాంటి అమృత ఘడియలలో విశ్వామిత్రుని అమృత వాక్కులతో నిద్ర లేచి విద్యాభ్యాసం చేసి కర్తవ్య నిర్వహణను గావించిన శ్రీరాముడు.. మానవునిగా జన్మించి, దైవంగా ఎలా పరిణితి చెందాడో గమనించి పాటించి పరిణితి చెందటానికే ఉదయం సుప్రభాతం వినవలసింది. తన తండ్రి యజ్ఞం చేస్తూ ప్రియమైన వాటిని దానం ఇస్తానన్న మాటకు కట్టుబడి.. గోవులను దానం చేస్తున్న సమయంలో ‘‘నన్నెవరికి దానమిస్తావు తండ్రీ?’’ అని పలుమార్లు తండ్రిని అడిగి... తండ్రి విసుగెత్తి కోపంతో ‘నిన్ను యమునికి దానమిస్తాను’ అని అన్న మాటలకు బద్ధుడై యముని వద్దకు వెళ్లి ఆయనతో సంవాదం చేసి మెప్పించి సకల జ్ఞాన సారాన్ని ఆర్జించగోరిన సాచికేతునితో యముడు

శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య మేతః
తౌ సంపరీత్యా వివినక్తి ధీరః
శ్రేయోహ ధీరోభి ప్రేయశో వ్రిణీతే
ప్రేయోమందో యోగక్షేమా ద్వ్రణీతే

‘‘శ్రేయమైనవి (preferable), ప్రియమైనవి (pleasurables) వీటిలో ఎంచుకోవలసి వచ్చినపుడు సామాన్యుడు ప్రియమైనవి ఎంచుకుంటాడు. ధీరుడు, బుద్ధి మంతుడు, వివేకి శ్రేయమైనవి ఎంచుకుంటాడు. ఎందుకంటే అతనికి లక్ష్య స్పష్టత ఉంది కాబట్టి. వ్యామోహం, ప్రలోభం ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతుంటాయి. వాటిని అధిగమించి అక్షయ లక్ష్యాన్ని చేరేవాడే ధీరుడు.’’ అని అంటాడు. మనకు కూడా తెల్లవారు జామున కష్టపడి లేవడమెందుకు, సుఖంగా నిద్రపోదాం అనిపిస్తుంది. ఆ క్షణంలో శ్రేయమైంది ఏది, ప్రియమైంది ఏది అని ఆలోచించి నిర్ణయం తీసుకొని కష్టమైనా సరే శ్రేయమైన నిర్ణయాన్ని తీసుకునే వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. లక్ష్యం పెద్దదైతే త్యాగం పెద్దదే కావాలి.

‘తిరుప్పావై’లో చిత్రం చిరుకాలెవిందు వున్నై సెవిత్తు... 
‘‘ఈ సమయం నా కర్తవ్య నిర్వహణ(భగవదారాధన)కు అత్యంత అనువైనది. ఈ సమయంలోనే మానవుడి ఉత్కృష్ట గుణాలన్నీ వృద్ధి చెందుతాయి. పక్షులు కూడా లేచి పరుగులు తీస్తుంటే ఉత్కృష్ట ప్రాణులమైన మనం ఏమీ చేయలేమా?...’’ అంటుంది ఆండాళ్. ఎందుకు చేయలేం? మనం చేయాల్సిందల్లా భగవంతుడు పుట్టుకతో ఇచ్చిన జీవ గడియారాన్ని (biological clock) పునఃప్రారభించడమే. అందుకే కఠోపనిషత్తులో ఇలా చెప్పారు.

ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత
క్షురస్య ధారా నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి

Awake ! arise! stop not till the goal is reached.
Path is as sharp as razor's edge and hard to go by.
లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైంది. అయితే సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిది ఏముంది? నూతన సంవత్సరంలో సూర్యుని కన్నా ముందే ఉదయించడానికి సంకల్పం తీసుకుని శుభాకాంక్షలతో ఆయన్ని మేల్కొలుపుదాం.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించ వద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయం రా....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...నిశా విలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగుననీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ... దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ .............................